వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ.. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల సమ్మె చేపట్టారు. ఇవాళ, రేపు దేశవ్యాప్తంగా బ్యాంకుల వద్ద ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచాలని 20 సార్లు చర్చలు జరిపామని, ఉన్నతాధికారులు 13 శాతానికి మించి పెంచేందుకు అంగీకరించ లేదని యునైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్ నేతలు వెల్లడించారు. తెలంగాణలోని జనగామ జిల్లాలో ఉన్న ఎస్బీఐ బ్రాంచీ ముందు ఉద్యోగులు ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఉద్యోగులపై పనిభారం పెరిగిపోయిందని, ఖాతాదారుల కోసం శ్రమించి, సేవలందిస్తున్నా, తమను పట్టించుకోకుండా, డిమాండ్ల పరిష్కారం విషయంలో సాగతీత ధోరణిలోనే ప్రభుత్వం ఉందని యూనియన్ నాయకులు ఆరోపించారు.రెండు రోజుల సమ్మెతో ప్రభుత్వం దిగిరాకుంటే, మార్చి 11 నుంచి మూడు రోజుల సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.